నేపాలీ దంపతుల చోరీ కేసు: దేశం విడిచిపెట్టి పోలేదు!

24 Sep, 2021 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెలికంనగర్‌లోని వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం చేసి పరారైన నేపాలీ దంపతులు దేశం విడిచిపెట్టి పోలేదని పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలు దేశ సరిహద్దు ప్రాంతాలలో విస్తృతంగా గాలింపులు చేపట్టాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, బీహార్‌ వంటి నాలుగు రాష్ట్రాలలో నిఘా పెట్టామని చెప్పారు. ఇప్పటికే పలు కీలక సాంకేతిక ఆధారాలు లభ్యమయ్యాయని.. వచ్చే రెండు రోజుల్లో నిందితులు ఇద్దరినీ పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తామని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేయగా.. ‘తినబోతూ రుచులు ఎందుకని’ సదరు ఉన్నతాధికారి సంబోధించారు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టెలికంనగర్‌లోని వ్యాపారి బీరం గోవిందరావు ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు లక్ష్మణ్‌ (34), పవిత్ర (30)లు గత ఆదివారం 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు చోరీ చేసి పరారైన విషయం తెలిసిందే. కేసు నమోదు కాగానే వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్‌ పోలీసులు నేపాల్‌ దంపతులు దేశం దాటకుండా చర్యలు చేపట్టారు. నేపాల్‌కు పారిపోకుండా దేశ సరిహద్దు భద్రతా దళాలకు నిందితుల ఫొటోలు పంపి అప్రమత్తం చేశారు.

చోరీ చేయగానే ప్రైవేట్‌ క్యాబ్‌లో నేరుగా ముంబైకి వెళ్లి అక్కడ్నుంచి విమానంలో నేపాల్‌కు పారిపోవాలని నిందితులు ప్లాన్‌ వేశారు. కానీ పోలీసుల నిఘా ఉండటంతో ప్లాన్‌ ఫలించలేదు. నిందితులు ఇద్దరు ముంబై విమానాశ్రయం వద్దే తిరిగినట్లు కీలక సమాచారం పోలీసులకు లభించింది. ఇద్దరు నిందితులతో పాటు వీరికి సహాయపడిన పలువురుని అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం.  

చదవండి: Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్‌’ వాచ్‌మెన్‌ దంపతులు

మరిన్ని వార్తలు