నవ వధువుది ఆత్మహత్యే.. 

9 Mar, 2023 01:44 IST|Sakshi

ఖలీల్‌వాడి: ఈ నెల 2న నిజామాబాద్‌ సుభాష్‌నగర్‌లోని సుధా హైట్స్‌ అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి చనిపోయిన పూర్ణిమ (26)ది ఆత్మహత్యే నని టౌన్‌ సీఐ వెంకట నారాయణ తెలిపారు. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వివరాలివి..

రెండు నెలల క్రితం హమాల్‌వాడికి చెందిన పూర్ణిమకు, విశాల్‌తో వివాహం జరిగింది. పూర్ణిమ ఐటీసీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటోంది. భర్త విశాల్‌ బిల్డింగ్‌ కాంట్రాక్ట్‌ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లయిన రెండు నెలల్లోపే.. పూర్ణిమ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు పైనుంచి పడి చనిపోవడంపై.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ మేరకు మూడో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో పూర్ణిమను భర్త విశాల్‌ వేధించేవాడని వెల్లడైంది. అపార్ట్‌మెంట్‌లోని సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల వారిని విచారించాక ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించి.. భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు