సాక్షి, హైదరాబాద్(కుషాయిగూడ): ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్థాపం చెందిన ఓ నవవధువు.. కాళ్ల పారాణి ఆరక ముందే ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా, చెన్నరావుపేట మండలం, లింగగిరికి చెందిన ఏకాంతం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ చర్లపల్లి, ఈసీనగర్లో నివాసం ఉంటున్నాడు. అతడి కూతురు శైలజ (22)ను మేనల్లుడు సతీష్కిచ్చి ఈ నెల 17న వారి ఊళ్లోనే బంధువుల సమక్షంలో వివాహం జరిపించాడు.
పెళ్లయిన వారం రోజుల తర్వాత అంతా కలిసి ఈ నెల 22న ఈసీనగర్కు వచ్చారు. బుధవారం ఉదయం సతీష్ ఉద్యోగానికి వెళ్లాడు. అదే సమయంలో తల్లి ఉన్న బెడ్రూంకు గడియ పెట్టి హాల్లో సీలింగ్ఫ్యాన్కు ఉరి వేసుకొని శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తనకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లనే శైలజ ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..)