నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది

16 Dec, 2021 13:54 IST|Sakshi
వివాహ సమయంలో గంగాభవానీ, కృష్ణమూర్తి

తాళ్లరేవు: వివాహం జరిగి రెండు నెలలు గడవకుండానే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పటవల గ్రామానికి చెందిన బీఎస్పీ, బీఈడీ చదివిన బడుగు గంగా భవానీకి, కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేట గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగా కృష్ణమూర్తికి అక్టోబరు–21వ తేదీన వివాహం జరిగింది. ఏమైందో తెలియదుగాని మంగళవారం అర్ధరాత్రి గంగాభవానీ పటవలలోని తన స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

బుధవారం ఉదయం తలుపు తెరచి చూడగా విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాసు ఘటనా స్థలానికి వచ్చి విచారణ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్‌ దంపతులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.  

భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడని, లక్షలాది రూపాయల కట్నం ఇచ్చి తమ కుమార్తెకు వివాహం చేశామని, అయితే వివాహం జరిగిన నాటి నుంచి కృష్ణమూర్తి తన విచిత్రమైన ప్రవర్తనతో గంగాభవానీని తరచూ వేధించేవాడని మృతురాలి తల్లి లక్ష్మీకాంతం బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. పెళ్లయిన తరువాత ఢిళ్లీ వెళ్లిన కృష్ణమూర్తి సెల్‌ఫోన్‌లో సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురిచేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమార్తె పలుమార్లు వేధింపులను తమ దృష్టికి తీసుకువస్తే సంక్రాంతి పండగకు వచ్చినప్పుడు మాట్లాడతామని చెప్పామని, అంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని బోరున విలపించారు.  


 

మరిన్ని వార్తలు