విషాదం.. నవ దంపతుల దుర్మరణం

12 Mar, 2021 07:50 IST|Sakshi

బైక్‌ అదుపు తప్పి నవ దంపతులు మృతి

ఇరు కుటుంబాల్లో విషాదం  

మంచాల:  బైక్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో నవ దంపతులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బోడకొండ గ్రామానికి చెందిన జాటోత్‌ లక్ష్మణ్‌ (28)కు అదే మండలం దాద్‌పల్లి తండాకు చెందిన శైలజ(21)తో జనవరి 9న వివాహం జరిగింది.  గురువారం మహా శివరాత్రి సందర్భంగా గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. అనంతరం బంధువుల పిలుపు మేరకు యాదాద్రి జిల్లా, కడీలబాయి తండా సమీంలోని హజ్రత్‌ గాలిబ్‌ షాహిద్‌ పీర్‌ దర్గా ఉర్సుకు బయలుదేరారు.

జాపాల సమీపంలోని పోచమ్మ ఆలయ ప్రాంతం వద్ద ఉన్న మలుపులో బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటలో లక్ష్మణ్, శైలజ తలలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే  మృతిచెందారు.  ఎస్సై సురేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

హెల్మెట్‌ లేనందునే..  
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతుల తలకు హెల్మెట్‌ లేనందునే ప్రాణాలు కోల్పోయారని మంచాల ఎస్సై సురేష్‌ అన్నారు. వాహనదారులు తప్పక  హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.   

చదవండి: కారుతో ఢీకొట్టి.. ఆపై గొంతు కోసి టీచర్‌ హత్య
దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

మరిన్ని వార్తలు