కాపురానికి వెళ్లినా వేధింపులు తప్పవు.. పుట్టింట్లో నవవధువు..

3 Dec, 2021 07:14 IST|Sakshi
పవిత్ర (ఫైల్‌) 

కట్నం కింద రూ.17 లక్షలు, ఇతరకానుకలు

తల్లిదండ్రులపై భారం పడుతుందని మనస్తాపం

పుట్టింట్లోనే ఉరేసుకుని అఘాయిత్యం

మిన్నంటిన బంధువుల రోదనలు

సాక్షి, ముత్తారం (పెద్దపల్లి): అదనపు కట్నం వేధింపులకు నవవధువు పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్‌లో విషాదం నింపింది. కట్నం కింద రూ. 17లక్షలు ఇచ్చి.. ఇతర కానుకలు ముట్టజెప్పినా.. భర్త, అత్తామామల వేధింపులు ఆగలేదు. అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని పుట్టింట్లో వదిలేయడం.. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వారిపై భారం వేయొద్దని కానరాని లోకాలకు వెళ్లింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అడవిశ్రీరాంపూర్‌కు మారం వెంకన్న, సరోజనకు కూతురు పవిత్ర, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పవితక్రు ఈ ఏడాది ఆగస్టు 21న మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం లక్ష్మి, ఓదెలు కుమారుడు నరేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.17లక్షలు, 17 తులాల బంగారం, ద్విచక్రవాహనం ఇచ్చారు. కాపురంలో పట్టుమని పది రోజులు కాకుండానే నరేశ్‌లో అదనపు కట్నమనే పిశాచి ఆవహించింది.

చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్‌ చేసి..)

వివాహం నాటి ఫొటో

తనకు ఫర్టిలైజర్‌ దుకాణంలో నష్టం వచ్చిందని, మరో రూ.10లక్షలు అదనంగా తేవాలని పవిత్రను వేధించసాగాడు. దీనికి నరేశ్‌ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు సురేశ్, బంధువులైన రమేశ్, రావుల చంద్రయ్య, పద్మ సహకరించారు. తనపై భర్త, అత్తామామలు, మరిది దాడి కూడా చేశారని పవిత్ర తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తెలపగా.. పెద్ద మనుషులను తీసుకెళ్లి పంచాయితీ పెట్టించారు. అందరికీ సర్దిచెప్పి వచ్చారు. అయితే దీపావళి పండుగ నిమిత్తం పవిత్రను పుట్టింట్లో వదిలివెళ్లిన నరేశ్‌.. అదనపు కట్నం తెస్తేనే కాపురానికి తీసుకెళ్తానని స్పష్టం చేశాడు.

చదవండి: (భూత్‌ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..)

తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడం.. కాపురానికి వెళ్లినా నరేశ్‌ నుంచి వేధింపులు తప్పవని మనస్తాపానికి గురైన పవిత్ర (24) గురువారం వేకువజామున దూలానికి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికే చనిపోయింది. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, సీఐ సతీశ్‌ సంఘటన స్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కట్నం వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని పవిత్ర తండ్రి ఫిర్యాదు మేరకు పవిత్ర భర్త చిందం నరేశ్, అత్తామామలు చిందం లక్ష్మీ, ఓదెలు, మరిది సురేశ్, రమేశ్, రావుల చంద్రయ్య, రావుల పద్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు.   

చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు)

మరిన్ని వార్తలు