ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం

31 May, 2023 15:26 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా హర్దా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడిని చేరుకుని విచారణ చేపట్టారు.

వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ఇటీవలే వివాహమైన జంటతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారని తెలిపారు.  ఈ దుర్ఘటనలో మృతిచెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా గతవారమే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు.. ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
చదవండి: Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్‌

whatsapp channel

మరిన్ని వార్తలు