Hyderabad: ఫేస్‌బుక్‌ ప్రేమ.. విలువైన బహుమతులు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..

18 Dec, 2021 19:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సైబర్‌ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. కేవైసీ అప్‌డెట్‌, ఓటీపీలు, విదేశాల నుంచి గిఫ్ట్స్‌, ప్రేమ, పెళ్లి పేరుతో హైదరాబాదీలను వలలో వేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సైబర్‌ నేరస్తుడిని సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నైజీరియన్‌కు చెందిన వ్యక్తి ఫేస్‌బుక్‌లో నకిలీ పేర్‌తో ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. తను యూకేలో డాక్టర్ అని నమ్మించాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నైజీరియన్‌.. యూకే నుంచి 40 వేల ఫౌండ్ల నగదు పార్శిల్‌ పంపిస్తున్నానని చెప్పాడు.

అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్‌ చేయించి.. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్శిల్‌, ఐటీ, మనీలాండరింగ్ ఇతర చార్జీల పేరుతో కొంత డబ్బు కట్టాలని మాట్లాడాడు. ఇది నిజమేనని నమ్మిన యువతి విడతల వారీగా 38 లక్షల రూపాయలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అయితే పార్శిల్‌ ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఢిల్లీలో ఉన్న నైజీరియన్ ఒనేకా సోలమన్ విజ్డమ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 7 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్ బుక్స్, ఒక డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: భార్యాభర్తలు వాట్సాప్‌ చాటింగ్‌.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్‌..

మరిన్ని వార్తలు