‘నువ్వొద్దు.. రెండో పెళ్లి చేసుకుంటా!’ కడుపుతో ఉన్న భార్య గొంతులో యాసిడ్‌ పోసి చంపాడు

28 Apr, 2022 10:51 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తల్లిని కాబోతున్నా అనే ఆనందాన్ని లేకుండా చేసిన ఆ మృగం.. అర్ధాంగి జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది. గర్భిణి అని కూడా చూడకుండా భార్య గొంతులో యాసిడ్‌ పోసి భర్త హత్య చేశాడు ఓ భర్త. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం రాజిపేట్‌లో ఈ దారుణం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ మండలం మల్కాపూర్‌ తండాకు చెందిన కళ్యాణి (24)కి రాజిపేట్‌కు చెందిన తరుణ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు సరైన జోడీ కాదని, రెండో పెళ్లి చేసుకుంటానని తరుణ్‌ భార్యను తరచూ వేధించేవాడు. వదిలించుకునే ప్రయత్నమూ చేశాడు. 

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం భర్త తరుణ్, మామ పిర్య, బావ ప్రవీణ్‌ కలిసి కళ్యాణి నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్‌ పోశారు. విషయం గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మరణించింది. మృతురాలు కళ్యాణి 3 నెలల గర్భిణి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువులు తరుణ్‌ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్, వస్తువులు ధ్వంసం చేశారు.

మరిన్ని వార్తలు