దొంగబాబా దారుణాలు.. తల్లీకూతుళ్లపై అత్యాచారం

13 Oct, 2020 14:35 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : భూతవైద్యం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగబాబా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో అతని బాగోతాలు బయటపడుతున్నాయి. గతంలో తాము కూడా అనేక వేధింపులకు గురయ్యామని బాధితులు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పూసల గల్లీలో ఐదేళ్ళ నుంచి భూత వైద్యం మెడిటేషన్ పేరుతో బాబా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగదీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపతున్న మెట్‌పల్లికి చెందిన తల్లీ, కూతురు ఇటీవల బాబాను ఆశ్రయించారు. (బాలికపై అత్యాచారం.. దొంగబాబాకు బడితపూజ)

అమాయకులైన వారికి మాయమాటలు చెప్పిన ప్రబుద్ధుడు తల్లీకూతుళ్లను లోపరుచుకున్నాడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడికి పాల్పడం, ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. ముందు తల్లిపై ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే  బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాకింగ్‌కు గురయ్యారు.

దారుణాన్ని తెలుకుని బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించడం బాబా బాగోతం బయటపడింది. దీంతో దొంగ బాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు కామాంధుడిని చితకబాదారు. చెప్పులు, చీపుర్లతో కిందపడేసి కసితీరా కొట్టారు. మరోవైపు బాబా బాగోతాలు ఒక్కొక్కటిగా  బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దొంగబాబా పోలీసుల అదుపులో ఉండగా.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ప్రబుద్ధిడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు