అనుమానం పెనుభూతమై.. భార్య గొంతు కోసి!

31 Mar, 2021 15:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త 

సాక్షి, నిజామాబాద్‌‌: భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన నగర శివారులో జరిగింది. నార్త్‌ రూరల్‌ సీఐ గురునాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంలోని 800 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న షేక్‌ సల్మాన్, షహనాజ్‌బేగంకు 11 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు బాలురు, రెండేళ్ల బాలిక ఉంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే సల్మాన్‌ భార్యపై ఆర్నెళ్ల నుంచి అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచుగా భార్యను వేధించసాగాడు. రెండు నెలల కిందట షహనాజ్‌బేగం భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లింది.

ఆమె తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి భర్త వద్దకు పంపించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భార్యభర్తల మధ్య తిరిగి గొడవ జరిగింది. దీంతో సల్మాన్‌ ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో షహనాజ్‌ బేగం గొంతుకోసి పరారయ్యాడు. సంఘటన స్థలంలోనే ఆమె మృతి చెందింది. సల్మాన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. మృతురాలు తండ్రి అబ్దుల్‌ షుకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ గురునాథ్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు