33 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్‌ చేస్తే మరో మహిళతో..

26 Jan, 2022 15:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: భార్య, ఇద్దరు కుమారులు ఉండి మరొక మహిళను వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇందల్‌వాయికి చెందిన చింత పద్మకు జక్రాన్‌పల్లి మండలం మనోహరబాద్‌కు చెందిన పులి రాజేంధర్‌గౌడ్‌తో 33 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 1995 నుంచి ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో పనిచేసే జంబుకరాజమణితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నడని తెలిపింది.

దీనిపై తాను ప్రశ్నిస్తే రాజమణితో ఎస్సీఎస్టీ కేసు పెట్టిస్తానంటూ బెదిరించారని వాపోయింది. తాను ఆర్మూర్‌ కోర్టులో మెయింటెనెన్స్‌ ఫైల్‌ చేయగా, ఈ కేసును విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించాడని తెలిపింది. ఈ కేసులో తన భర్త కౌంటర్‌ కేసు వేసి రెండో భార్య గురించి రాయకుండా కోర్టును తప్పుదోవ పట్టించాడని తెలిపింది. ఎస్సీ,ఎస్టీ కేసులకు భయపడి తన తరపున ఎవరూ సపోర్టు చేయటం లేదని ఫిర్యాదులో పేర్కొంది. రాజమణితో తన భర్తకు దగ్గర ఉండి వివాహం చేసిన మరిది పులి  రామాగౌడ్, అతని భార్య పులి బాలమణిలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీకు ఫిర్యాదు చేసింది.    

మరిన్ని వార్తలు