ఖైదీ కడుపులో సూసైడ్‌ నోట్‌!

16 Oct, 2020 13:25 IST|Sakshi

ముంబై : ఆత్మహత్య చేసుకున్న ఖైదీ కడుపులో సూసైడ్‌ నోట్‌ లభించిన ఘటన మహారాష్ట్ర నాసిక్‌ సెంట్రల్‌ జైలులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన అస్గర్‌ మన్సూరీ హత్యా నేరంతో నాషిక్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరి కొన్ని నెలల్లో శిక్షా కాలం పూర్తయి విడుదల కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7న జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అస్గర్‌ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించగా.. అతడి కడుపులో ఓ సూసైడ్‌ నోట్‌ బయటపడింది. పాలిథిన్‌ కవర్లో చుట్టిన ఆ సూసైడ్‌ నోట్‌లో తన చావుకు గల కారణాలను వివరించాడు అస్గర్‌. ( ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు )

జైలు సిబ్బంది వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో పేర్కొన్నాడు. కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మరి కొంతమంది ఖైదీలు సైతం జైలు సిబ్బంది వేధింపులపై అధికారులు, ముంబై హైకోర్టుకు లేఖ రాశారు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. చదవటం, రాయటం రాని అస్గర్‌ వేరే వ్యక్తి సహాయంతో ఆ సూసైడ్‌ నోట్‌ రాయించుకుని ఉంటాడని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు