విషాదం: ఏమైందో తెలియదు.. తరగతి గది నుంచి బయటకి వచ్చి..

31 Aug, 2021 08:23 IST|Sakshi
ఉమామహేశ్వరి (ఫైల్‌ ఫొటో)  

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

పేదింటి బిడ్డ విషాదాంతం

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

సంఘటనపై పోలీసుల దర్యాప్తు 

కాకినాడ క్రైం: ఓ నర్సింగ్‌ విద్యార్థిని సోమవారం కాకినాడలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతాప్‌నగర్‌ నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న 18 ఏళ్ల దిడ్ల ఉమామహేశ్వరిది కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం. ఈ నెల 23న జీఎన్‌ఎం మొదటి సంవత్సరంలో చేరింది. సోమవారం స్నేహితులతో కలిసి తరగతులకు హాజరై ఉదయం 11.40 సమయంలో తరగతి గది నుంచి బయటకి వచ్చింది. నేరుగా తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది. జ్వరం వచ్చి తరగతులకు వెళ్లకుండా పక్కగదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఓ విద్యార్థిని ఈ విషయాన్ని గమనించింది.

వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపింది. ప్రిన్సిపాల్‌ సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్‌ పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. టేకి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావు, విజయలక్ష్మి దంపతులకు ఉమామహేశ్వరి రెండవ సంతానం, నిరుపేద రైతు కూలీ కుటుంబానికి చెందిన ఈమె ఇంటర్మీడియెట్‌ కాకినాడలోని ఎస్సీ హాస్టల్‌లో ఉండి చదువుకుంది.

ఉమామహేశ్వరి సున్నిత మనస్కురాలని తోటి విద్యార్థులు, బంధువులు పోలీసులకు తెలిపారు. విగత జీవిగా పడున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించినట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదన్నారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు.

ఇవీ చదవండి:
ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

మరిన్ని వార్తలు