Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు'

2 Nov, 2022 06:58 IST|Sakshi

సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): నర్సింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెరుమాలైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..  నాగై జిల్లా వేదార ణ్యం తాలూకా పెరుమాలై గ్రామానికి చెందిన ఇళయరాజా కుమార్తె ఇందుజ (18) కడినాల్‌ వైయల్‌ ప్రాంతంలో ఉంటూ ప్రైవేటు నర్సింగ్‌ శిక్షణ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక్కడ 14 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వీరిలో 13 మంది రోజు ఇంటికి వచ్చి వెళుతున్నారు. ఇందుజా మాత్రం పేదరికం కారణంగా కళాశాలలోనే ఉన్న స్త్రీల గదిలో ఉంటోంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి విద్యార్థిని బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వేదారణ్యం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విద్యార్థిని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘నాన్న తాగవద్దు, అమ్మను కొట్టవద్దు, నేను మీకు ఏదో చేయాలని తలుచుకున్నానని, కానీ వీలు కాలేదు. అంతా అన్న చూసుకుంటాడు.’అని రాసి ఉంది. పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని శవపరీక్ష కోసం వేదారణ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థి మృతిపై తమకు సందేహం ఉన్నట్లు ఆమె బంధువులు ఆస్పత్రిని ముట్టడించి, ఆందోళన చేపట్టారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సాయుధ దళ పోలీసు..  
తిరుపూర్‌లో సాయుధ దళం పోలీసు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. తేనె జిల్లా సురులిపట్టికి చెందిన ఈశ్వరన్‌ (33) తిరుపూరు జిల్లా సాయుధ దళంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతోసహా నల్లూరు ప్రాంతంలో ఉన్న జిల్లా సాయుదళ పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఈశ్వరన్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకుని, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లిని ఫ్యాన్‌కు భార్య చీరతో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు సమాచారం అందజేశారు. నల్లూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు