పోలీసులకు సహకరించని నూతన్‌నాయుడు

15 Sep, 2020 08:46 IST|Sakshi

శిరోముండనం కేసు విచారణ సమయంలో కడుపునొప్పి అంటూ డ్రామా 

ముగిసిన మూడు రోజుల కస్టడి.. తిరిగి సెంట్రల్‌ జైల్‌కు 

సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ పేరిట పలువురు అధికారులకు ఫోన్లు చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్‌ బాస్‌ ఫేం నూతన్‌నాయుడునుసోమవారం సాయంత్రం పోలీసులు సెంట్రల్‌ జైలుకు తరలించారు. విశాఖ పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్‌ చేసి 14 రోజుల పాటు రిమాండ్‌కు ఆరిలోవ సెంట్రల్‌ జైల్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే శని, ఆది, సోమవారాల్లో విచారణ నిమిత్తం పోలీస్‌ కస్టడీకి కోర్టు అనమతిచ్చింది. విచారణ అనంతరం తిరిగి జైలుకు పంపారు. 

  • మూడు రోజుల విచారణలో శిరోముండనం కేసులో పోలీసులకు నూతన్‌నాయుడు సహకరించలేదని తెలిసింది. శిరోముండనం చేసిన సమయంలో తాను రాజమండ్రిలో ఉన్నట్టు నూతన్‌నాయుడు చెప్పినట్టు సమాచారం.
  • దళిత యువకుడు శ్రీకాంత్‌పై దాడి, శిరోముండనానికి ముందు తన భార్యతో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఆ కోణంలో ప్రశ్నించారు.
  • వీటికి సమాధానం చెప్పకుండా కడుపులో నొప్పిగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేసినట్టు పోలీసులు చెప్పారు.
  • మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ పేరిట ప్రభుత్వ వైద్యులకు ఫోన్‌ చేసిన కేసుల్లో, ఉద్యోగం ఇప్పిస్తానని నూకరాజు నుంచి రూ.12 కోట్లు వసూలు చేసినట్టు మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపైనా విచారించారు.

మళ్లీ పోలీస్‌ కస్టడీ కోరతాం.. 
బ్యాంక్‌ ఉద్యోగం ఇస్తామని రూ.12 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు నమోదైన కేసులో అవసరమైతే నూతన్‌నాయుడిని మళ్లీ పోలీస్‌కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి మీడియాతో చెప్పారు.

మరిన్ని వార్తలు