Odisha Train Incident: బాలాసోర్‌ ఘటనపై సీబీఐ దర్యాప్తు షురూ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

6 Jun, 2023 16:34 IST|Sakshi

భువనేశ్వర్‌: బాలాసోర్‌ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్‌ టీంతో పాటుగా చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఆపై ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల ప్రకారం.. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  

ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్‌, సిగ్నల్‌ రూమ్‌ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది.   

ఇదిలా ఉంటే.. ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్‌ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది.

సిగ్నల్‌ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో చూడాలి. 

జూన్‌ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు. 

ఇదీ చదవండి: ఒడిశా ఘటన.. అయినవాళ్లు ఎక్కడ?

మరిన్ని వార్తలు