అమానవీయం.. అప్పు చెల్లించలేదని స్కూటర్‌కు కట్టేసి.. నడిరోడ్డుపై..

17 Oct, 2022 16:54 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా కటక్‌ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి  ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. యువకుడు తనకు తెలిసిన వాళ్ల దగ్గరే కొంతడబ్బు అప్పుగా తీసుకున్నాడని, కానీ వాళ్లు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అతను ఇవ్వకపోవడంతో ఇలా చేశారని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందని వివరించారు. ఇది చాలా సున్నితమైన కేసు అయినందున నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. విచారణ పూర్తయ్యక అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఒడిశాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. గతంలోనూ ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించాడని అతడ్ని లారీ ముందుభాగంలో కట్టేసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. జగత్‌సింగ్‌పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చదవండి: అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్.. కానీ.. పెళ్లిపై షరతు!

మరిన్ని వార్తలు