Shamirpet: దారుణ హత్య.. బంగారం కోసమేనా..?

17 May, 2021 07:31 IST|Sakshi

శామీర్‌పేట్‌: ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధి లాల్‌గడి మలక్‌పేట గ్రామానికి చెందిన పొలంపల్లి లక్ష్మి(60), భర్త చనిపోగా కూతుళ్లకు వివాహం చేసి, కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

కాగా అదే గ్రామంలో నిర్మా­ణంలో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో రక్తపుమడుగులో పడి ఉన్న లక్ష్మిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలకు తీవ్రగాయలై మృతి చెందినట్లు గుర్తించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సహకారంతో పోలీసులు ఆధారాలు సేకరించారు.

నగలు, నగదు కోసం హత్య జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట సీఐ సుధీర్‌కుమార్‌ తెలిపారు. అనంతరం పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలసుకున్నారు. ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారం కనిపించడం లేదని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు.
చదవండి: పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణం

మరిన్ని వార్తలు