-

దారుణం: 55 ఏళ్ల వ్యక్తి, ఏడేళ్ల బాలికను మాటల్లో దింపి.. ఆపై

29 Jun, 2021 14:02 IST|Sakshi

సాక్షి, గీసుకొండ(వరంగల్‌) : ఏడేళ్ల బాలికపై తాత వయస్సు(55) ఉన్న ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విశ్వనాధపురంలోని సదరు బాలిక తండ్రి గతంలో మృతి చెందగా తల్లితో ఇంటివద్దే ఉంటోంది. సోమవారం సాయంత్రం తాగునీరు తేవడానికి సమీపాన ఉన్న వాటర్‌ ప్లాంట్‌ వద్దకు వెళ్లిన బాలికను పసునూరి ఐలయ్య మాటల్లో దింపి చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా.. ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు యువకులు గమనించి బెదిరిండంతో ఐలయ్య పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఐలయ్య ఇంటికి వెళ్లి అతడి కోసం వెతికారు.

కనిపించకపోవడంతో ఇంటి తలుపులు పగులగొట్టారు. స్థానికులు 100 నంబర్‌కు డయల్‌ చేయడంతో మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, మామునూరు సీఐ రమేశ్, గీసుకొండ ఎస్సై బండారి రాజు సిబ్బందితో రాత్రి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గొడవలకు పాల్పడవద్దని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను శాంతింపజేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేశ్‌కుమార్‌ తెలిపారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

చదవండి: Cyber Crime: నేరగాళ్లకు సింహస్వప్నం..కామాక్షిశర్మ..

మరిన్ని వార్తలు