లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను చంపిన వృద్ధుడు

18 Oct, 2021 04:22 IST|Sakshi

హంతకుడిని కొట్టి హతమార్చిన జనం

ప్రకాశం జిల్లా కామేపల్లిలో వరుస ఘటనలు

కొండపి: ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడు ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దారుణంగా గొంతు కోసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆగ్రహించిన గ్రామస్తులు మూకుమ్మడిగా దాడిచేసి అతడిని కొట్టి చంపేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలోఆదివారం చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయమ్మ (42) కాళ్ల నొప్పులతో బాధపడుతోంది. గ్రామంలోని వడ్డెపాలెంలో తన్నీరు ఓబిశెట్టి (62) బేల్దారి పని చేసుకుంటూ.. చిన్నచిన్న సమస్యలకు అంత్రాలు వేస్తుంటాడు. సాయంత్రం ఐదున్నర సమయంలో అంత్రం వేయించుకునేందుకు ఓబిశెట్టి ఇంటికి విజయమ్మ వెళ్లింది. ఓబెశిట్టి తలుపులు వేసి ఆమెపై లైంగిక దాడికి యత్నించగా విజయమ్మ ప్రతిఘటించింది. పెద్దగా అరవడంతో కత్తితో గొంతుకోసి, ఒళ్లంతా పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం కత్తితో బయటకు వచ్చి కూర్చున్నాడు.

చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 7 గంటల సమయంలో ఎస్సై సుల్తానా రజియా ఘటనా స్థలానికి చేరుకుని ఓబిశెట్టిని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహించి ఓబిశెట్టిపై దాడి చేశారు. సుమారు 200 మంది గ్రామస్తులు ఎస్సై, పోలీసు సిబ్బందిని దాటుకుని వెళ్లి దాడిచేసి తీవ్రంగా కొట్టడంతో ఓబిశెట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని సీఐ లక్ష్మణ్, కొండపి ఎస్సై రాంబాబు పరిశీలించారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓబిశెట్టి భార్య మూడు నెలల క్రితం మరణించింది. 

మరిన్ని వార్తలు