బోన్‌ క్యాన్సర్ అని తెలియడంతో...

30 May, 2022 11:15 IST|Sakshi

జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీకి చెందిన దువ్వారాపు రాము(32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేసిన రాము అనారోగ్యం కారణంగా కొద్ది నెలల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. గతంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కాగా వైద్యపరీక్షలు చేయించగా బోన్‌ క్యాన్సర్‌ అని తేలడంతో మాసికంగా కుంగిపోయాడు.

భార్య, పిన్ని చర్చికి వెళ్లిన సమయంలో శ్లాబ్‌కు చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రాముకు బాల్యం నుంచి కష్టాలే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని అసిరిపోలమ్మ అన్నీ తానై పెంచింది. ఈ క్రమంలో వివాహం కూడా చేసింది. రాముకు భార్య యమున, కుమారుడు హర్షవర్దన్‌ ఉన్నారు. అసిరిపోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు. 

లారీని ఢీకొట్టిన బైక్‌ 
ఇచ్ఛాపురం: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పులారి జానకిరావు (27), పిన్నింటి దర్మరాజు, మద్దిలి ప్రవీణ్‌కుమార్‌లు ఆదివారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సుమండి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి ఢీకొట్టారు.

ఈ ఘటనలో జానకిరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మరాజు, ప్రవీణ్‌కుమార్‌లను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తీసుకెళ్లారు. ఒడిశా గొలంత్ర పోలీసులు కేసు నమోదు చేసి జానకిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరంపురం పెద్దాసుపత్రికి తరలించారు.  

(చదవండి: భార్యపై కతితో దాడి చేసి...ఆ తర్వాత...)

మరిన్ని వార్తలు