బయటపడుతున్న దొంగ బాబా బాగోతాలు

16 Oct, 2020 14:51 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : భూత వైద్యం పేరుతో మహిళల మానాలతో ఆటలాడుతున్న పోతుల శివప్రసాద్‌పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ అనేక మం‍ది బాధితులు బయటపడుతున్నారు. భూతవైద్యం పేరుతో తల్లీబిడ్డలపై అత్యాచారం చేసిన దొంగబాబా బాగోతాలు ఈనెల 13న బయపడిన విషయం తెలిసిందే. తాజాగా అతనిపై మరో మహిళ నిజామాబాద్‌ ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీర్ఘ కాల వ్యాధులు అనారోగ్య సమస్యలతో బాధడపతున్న తనవద్ద నుంచి మెడిటేషన్, భూత వైద్యం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడని లైంగికంగా కూడా ఇబ్బందులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దొంగబాబాపై నలుగురు బాధితులు ఫిర్యాదు చేశారు. (దొంగబాబా దారుణాలు: తల్లీకూతుళ్లపై అత్యాచారం)

మరోవైపు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూతవైద్యం పేరుతో దాదాపు 20 మందికి పైగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పుసల గల్లీలో దొంగబాబు బాగోతాలు బయటపడటంతో మహిళా సంఘాల ప్రతినిధిలు అతనికి దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. తాజాగా మరో కేసు నమోదు కావడంతో విచారణను మరింత వేగవంతం చేశారు. బాబాల పేరుతో చలమణీ అవుతున్న మోసగాళ్లను నమ్మవద్దని పోలీసులు, ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు