చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం

27 Jun, 2022 09:20 IST|Sakshi

సనత్‌నగర్‌: ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాది వయస్సున్న బాలికను కారు ఢీ కొనటంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి మృతిచెందింది.  సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జింకలవాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ముత్తు యాదవ్‌ తెలిపిన మేరకు.. ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకునే అఖిల్‌ జింకలవాడ బస్తీలో గత కొన్నేళ్లుగా నివాసముంటున్నాడు. అతని కుమార్తె మోక్షిత (14 నెలలు) ఆదివారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటోంది.

ఇదే సమయంలో అటుగా వచ్చిన కారు అఖిల్‌ ఇంటి ముందు ఆగింది. డ్రైవింగ్‌ సీటులో ఉన్న యువకుడితో పాటు కొంతమంది యువకులు అక్కడ దిగిన తరువాత మహ్మద్‌ రసూల్‌ అనే వ్యక్తి డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. కారు ముందున్న పాపను గమనించకుండా నిర్లక్ష్యంగా కారును నడిపి చిన్నారిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డి చిన్నారిని తల్లిదండ్రులు నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మృతికి కారణమైన రసూల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడ్డ చిన్నారికి తల్లిదండ్రులు సపర్యలు చేస్తుంటే కారుతో ఢీకొట్టిన మహ్మద్‌రసూల్‌  నిలబడి చూస్తుండడం  స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

(చదవండి: అరెస్ట్‌ భయంతో ఆత్మహత్యాయత్నం)

మరిన్ని వార్తలు