నమ్మించి.. నట్టేట ముంచారు 

5 Jan, 2021 10:40 IST|Sakshi

సుమారు రూ.25 కోట్లతో నలుగురు యువకులు పరారీ

ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): నిజామాబాద్‌ జిల్లాలో ఆన్‌లైన్‌ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలలో పెట్టుబడి పెడితే కొన్ని రోజులకు రెట్టింపు చేసిస్తామని నలుగురు వ్యక్తులు జిల్లాలోని పలువురు యువకులను నమ్మించి రూ.25 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు సోమవారం పోలీస్‌ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశా రు. చైన్‌ స్కీం, ఈగల్‌ బిట్‌ కాయిన్, యాడ్స్‌ స్టూడియో, వరల్డ్‌ డిజిటల్‌ గోల్డ్‌ కాయిన్‌ సంస్థల పేరుతో చిట్టోజి రాజేశ్, తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్‌ జిల్లాలో కొంతమంది యువకులను సంప్రదించారు.

ఆన్‌లైన్‌ ద్వా రా తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు చేసిస్తామని, సంస్థల్లో ఇంకా కొం తమందిని సభ్యులుగా చేర్చితే కమీషన్‌ వస్తుందని చెప్పారు. ఈ మాటలను నమ్మిన ఆర్మూర్, నందిపేట్, నిజామాబాద్‌ నగర ప్రాంతాలకు చెందిన యువకులు ఒక్కొక్కరు రూ.63వేల వరకు నాలుగైదు సార్లు ఆన్‌లైన్‌లో చెల్లించారు. వీరు పెట్టుబడి పెట్టినందుకు కొంత లాభం వచ్చిందంటూ రాజేశ్‌ బృందం ప్రతినెలా రూ.5 వేల వరకు రెండు, మూడు నెలల పాటు ఆ యువకులకు ఇచ్చింది. దీంతో డబ్బులు వస్తున్నాయనే ఆశతో బాధిత యువకులు చాలామందిని సభ్యులుగా చేర్పించి వారితోనూ పెట్టుబడి పెట్టించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 450 మంది సభ్యులుగా చేరగా, రూ.25 కోట్లకు పైగా పెట్టుబడిగా వచ్చింది. ఇటీవల తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్, చిట్టోజి రాజేశ్‌కు పెట్టుబడి పెట్టిన వారు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురూ పారిపోయారని, వారిని పట్టుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు. 

మరిన్ని వార్తలు