కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర

26 Apr, 2022 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(కర్ణాటక): ప్రముఖ ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి కిడ్నీ దానం చేసే వారికి రూ.4 కోట్లు  ఇస్తామని ప్రకటనలు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ఆఫ్రికా దేశీయులను సోమవారం  బెంగళూరు ఆగ్నేయ విభాగం సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘనా దేశానికి చెందిన  మిని మిరాకల్, నైజీరియాకు చెందిన  కోవా కూలింజ్, మ్యాథ్యూ ఇన్నోసెంట్‌ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.

సోమవారం అదనపు పోలీస్‌ కమిషనర్‌ సుబ్రమణ్యేశ్వరరావ్‌ ఈ వివరాలను తెలిపారు. పై ముగ్గురూ గతంలోనూ కిడ్నీల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి అరెస్టయ్యారు. విడుదలై మళ్లీ దందా సాగించారు. నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల పేర్లతో నకిలి వెబ్‌సైట్లు, వాట్సప్‌ ఖాతాలను రూపొందించి ఒక కిడ్నీ విరాళమిస్తే రూ. 4 కోట్లు ఇస్తామని ప్రచారం చేశారు.. ప్రముఖ ఆస్పత్రుల పేర్లతో ఉండడంతో నిజమేననుకుని పలువురు సంప్రదించగా వారి నుంచి వివిధ రుసుముల కింద డబ్బు వసూళ్లు చేశారు.

మోసమని తెలిసి కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బంది అని మిన్నకుండిపోయారు. ఆస్పత్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అమృతహళ్లి అపార్టుమెంట్‌పై దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితులు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ సీఈఎన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు