భూ తగాదా.. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.. చివరికి

30 Jun, 2022 10:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాయగడ(భువనేశ్వర్‌): పోలీసులు తనకు న్యాయం చేయడం లేదనే మనస్థాపంతో ఒక యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చందిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒంటామడ గ్రామానికి చెందిన తిరుపతి జరువా గ్రామంలోని శివ మందిరం దగ్గరలో ఉండే హోమశాల పైకప్పుకు తాడుతో ఉరి వేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తన భర్త సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య చుట్టుపక్కల వెతికింది. ఈ సమయంలో తన భర్త ఉరికి వేలాడుతూ కనిపించడంతో బోరుమని విలపించింది.

చుట్టుపక్కల వారు అక్కడికు వచ్చి పొలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో ఒక భూ తగాదాకు సంబంధించి కొంతమంది వ్యక్తులతో తిరుపతికి వైరం కొనసాగుతోంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ చందిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు న్యాయ చేయడం లేదని, ప్రత్యర్థులు తనను నిత్యం వేధిస్తుండడంతో గత్యంతరం లేక చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో రాశాడు. విషయం తెలుసుకున్న పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి అనుమానుతులుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీవో దేవజఓతి దాస్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

చదవండి: Road Accident Today: సత్యసాయి జిల్లా: ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం

మరిన్ని వార్తలు