రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..

24 Dec, 2022 12:08 IST|Sakshi

రాయగడ(భువనేశ్వర్‌): పట్టణంలోని సాయి ఇంటర్‌నేషనల్‌ హోటల్‌లో ఓ విదేశీయుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రష్యాకు చెందిన వ్లాదిమర్‌ బిదానోబ్‌(61)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్‌డీపీఓ దేవజ్యోతి దాస్‌ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న రష్యాకు చెందిన నలుగురు పర్యాటకులు ఒడిశాలోని దారింగిబడి నుంచి రాయగడలో పర్యటించేందుకు వచ్చారు.

ఈ క్రమంలో వారి వెంట వచ్చిన గైడ్‌ స్థానిక సాయి ఇంటర్‌నేషనల్‌ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించారు.  గురువారం రాత్రి వ్లాదిమర్‌తో పాటు అతనితో వచ్చిన మరో విదేశీయుడు కలిసి ఒకే గదిలో మద్యం సేవించారు. అయితే తెల్లవారు లేచి చూసేసరికి వ్లాదిమర్‌ మృతి చెందడంతో హోటల్‌ మేనేజర్‌కు విషయాన్ని తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.

అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమా? లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్‌డీపీఓ దాస్‌ మీడియాతో మాట్లాడుతూ విదేశీయుడి మృతికి సంబంధించి నియమాల ప్రకారం సమాచారాన్ని రష్యా రాయబార కార్యాలయానికి విషయం చేరవేశామని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నట్ల తెలిసిందని, మిగతా సమాచారం అందాల్సి ఉందని వివరించారు.

చదవండి: షాకింగ్‌ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది?
 

మరిన్ని వార్తలు