పీఏ మృతి: కలెక్టర్‌పై హత్య కేసు

17 Nov, 2020 13:20 IST|Sakshi

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌పై మల్కన్‌గిరి పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం హత్య కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. కలెక్టర్‌ దగ్గర పీఏగా పని చేసిన దేవ్‌ నారాయణ పండా గత ఏడాది డిసెంబర్‌26న అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని జిల్లాలోని సతిగుడ జలాశయంలో గుర్తించారు. దేవ్‌ నారాయణ పండా ఆత్మహత్యకు పాల్పడ్డాడో? హత్యకు గురయ్యాడో తెలియరాలేదు. ఆ సమయంలో  విచారణ చేపడతామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి విచారణ చేపట్టలేదు.

దీంతో మనస్తాపానికి గురైన దేవ్‌ నారాయణ పండా భార్య వనజ పండా తన భర్త అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పందించిన కోర్టు మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్, మరో ముగ్గురు కలెక్టరేట్‌ సిబ్బందిపై హత్య కేసు నమోదు చేశారు. కలెక్టర్‌పై హత్య కేసు నమోదు కావడంతో ఆయన స్థానంలో మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌గా ఎద్దుల విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.  

>
మరిన్ని వార్తలు