బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు 

12 Oct, 2021 10:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: కడలూరు డీఎంకే ఎంపీ రమేష్‌.. సోమవారం బన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని పోలీసులు రెండు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. తన పరిశ్రమలో పనిచేస్తున్న గోవిందరాజన్‌ అనే వ్యక్తిని హింసించడమే కాకుండా బలవంతంగా విషం తాగించి హతమార్చినట్లు ఎంపీ రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీపై సీబీసీఐడీ హత్య కేసు నమోదు చేసింది.

అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్‌ను సీబీసీఐడీ వర్గాలు అరెస్టు చేశాయి. ఎంపీని కూడా అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో సోమ వారం బన్రూట్టి కోర్టులో ఎంపీ రమేష్‌ లొంగిపోయారు. రిమాండ్‌కు వెళ్లే సమయంలో ఎంపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో తాను నిర్దోషినని, కొన్ని రాజకీయ పార్టీలు తన మీద వచ్చిన ఆరోపణల్ని రాజకీయం చేసే పనిలో పడ్డాయని, అందుకే కోర్టులో లొంగి పోయినట్టు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు