‘మా బిడ్డను చంపేశారు.. న్యాయం చేయండి’

29 Mar, 2021 09:14 IST|Sakshi
మృతురాలు బాలిక ఫొటోతో తల్లిదండ్రులు

ఒంటిపై దుస్తులు లేకుండా పలు గాయాలున్నాయి

ఆత్మహత్యపై కనీస అవగాహన లేని పిల్ల ఉరి వేసుకుంటుందా

ఇది కావాలనే ఎవరో చేసిన హత్య

మృతిచెందిన బాలిక తల్లిదం‍డ్రుల ఆవేదన

సాక్షి, సైదాబాద్‌: ‘మా బిడ్డది అనుమానస్పద మృతి కాదు.. కావాలనే ఎవరో చంపేశారు.. మాకు న్యాయం చేయండి’ అని బాలిక తల్లిదండ్రులు పోలీస్‌ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈనెల 23న సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాజాబాగ్‌లో బాలిక అనుమానస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం బాలిక తల్లిదండ్రులు జ్యోతి, సేవ్యానాయక్‌ మాట్లాడుతూ... గత మంగళవారం పనికి వెళ్లి వచ్చేసరికి తమ పదేళ్ల పెద్ద కూతురు పడిపోయి ఉందని పరిశీలించగా అప్పటికే మృతి చెందిందన్నారు. బాలిక ఒంటిపై దుస్తులు లేకుండా పలు గాయాలున్నాయని రోధిస్తూ తెలిపారు. తమ కూతురు మెడపై ఉరి వేసిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్మహత్యపై కనీస అవగాహన లేని పిల్ల ఉరి వేసుకుంటుందా అని వారు ప్రశ్నించారు. ఇది కావాలనే ఎవరో చేసిన హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు వాస్తవాలు వెలికి తీయాలని విన్నవించుకున్నారు. తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. 

దర్యాప్తు కొనసాగుతోంది.. 
సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ... ఘటన జరిగిన రోజు తమ విచారణలో పాప ఉరి వేసుకోవటంతోనే మృతి చెందిందని తెలిపారు. ఆ రోజు తల్లిదండ్రులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇప్పటికీ కేసు విచారణలోనే ఉందని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తరువాత దర్యాప్తు చేస్తామన్నారు. బాలిక మృతి ఘటనపై సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం అన్నారు.  

చదవండి: సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌.. ‘నేను చనిపోతున్నా

మరిన్ని వార్తలు