గుట్కా డాన్‌ నూకల మనోహర్‌పై  పీడీ యాక్ట్‌

10 Aug, 2020 09:06 IST|Sakshi
నూకల మనోహర్‌  

కోవెలకుంట్ల/ కర్నూలు(టౌన్‌): కోవెలకుంట్ల కేంద్రంగా నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న నూకల మనోహర్‌పై పీడీయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సుబ్బరాయుడు ఆదివారం కోవెలకుంట్ల సర్కిల్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మనోహర్‌ కొన్నేళ్ల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు  చెందిన పలువురు వ్యక్తులతో కలిసి గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. జిల్లాలోని ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాల, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసేవాడు.

ఇందుకు సంబంధించి అతనిపై 14 కేసులు నమోదయ్యాయి. కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, ఆళ్లగడ్డ పీఎస్‌లో మూడు, ఆళ్లగడ్డ రూరల్, శిరివెళ్ల, నంద్యాల తాలూకా స్టేషన్లలో ఒక్కొక్క కేసు ఉన్నాయి. ఈ కేసుల్లో పలుమార్లు అరెస్టయ్యి.. జైలుకు కూడా వెళ్లొచ్చినా నేర ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. గత నెల 22వ తేదీన రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి తెస్తూ స్పెషల్‌ పార్టీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని గుట్కా వ్యాపారాన్ని సీరియస్‌గా పరిగణించిన పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు కోసం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్పకు ప్రతిపాదనలు పంపగా..వారు అనుమతి ఇచ్చారు. దీంతో మనోహర్‌పై పీడీయాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

మరిన్ని వార్తలు