న్యాయవాదుల హత్య: సీన్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌?!

20 Feb, 2021 09:44 IST|Sakshi

గోదావరిఖని ఆస్పత్రిలో నిందితులకు కరోనా టెస్ట్‌

పొద్దుపోయాక ఘటన స్థలికి తీసుకొచి్చన పోలీసులు

గోదావరిఖని ఏసీపీ ఆధ్వర్యంలో రీకన్‌స్ట్రక్షన్‌

రాత్రి 11 గంటలకు మంథని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు 

14 రోజుల రిమాండ్‌ విధించిన జడ్జి

రామగిరి(మంథని): హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై తమ అదుపులో ఉన్న నిందితులతో పోలీసులు శుక్రవారం పొద్దుపోయాక సీన్‌ రీకన్‌స్ట్రక‍్షన్‌ చేసినట్లు తెలిసింది. రామగిరి మండలం కల్వచర్ల శివారులోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకట నాగమణి దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వీరిని శుక్రవారం కోర్టులో రిమాండ్‌ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే రిమాండ్‌ చేయకుండా సంఘటన స్థలికి నిందితులను సాయంత్రం భారీ బందోబస్తు మధ్య తీసుకొచ్చినట్లు సమాచారం. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ ఆధ్వర్యంలో మర్డర్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక‍్షన్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రధాన రహదారిపై పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న విషయం తెలియని ప్రయాణికులు మళ్లీ ఏదైన జరిగిందా అని ఆసక్తిగా తిలకించారు. సీన్‌ రీకన్‌స్ట్రక‍్షన్‌ చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

నిందితులకు కరోనా పరీక్షలు
కోల్‌సిటీ(రామగుండం): హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, పీవీ.నాగమణి జంట హ్యత కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను పోలీసులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించా రు. ముగ్గురికీ కరోనా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. వైద్యులు వారికి ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. రిమాండ్‌కు తరలించడం కోసం ముందస్తుగా టెస్టులు చేయించారు. కాగా, నిందితులను భారీ బందోబస్తు మధ్య ఆస్పత్రికి తీసుకొచ్చారు. వాహనంలో నిందితులతోపాటు వారికి కత్తులు సమకూర్చినట్లు పోలీసులు తెలిపిన బిట్టు శ్రీను కూడా ఉన్నాడు. అయితే బిట్టు శ్రీనుకు కూడా కరోనా పరీక్షలు చేయించనున్నట్లు తెలిసింది. 

రాత్రి 11 గంటల కోర్టుకు..
మంథని: రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో బుధవారం జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రాత్రి 11 గంటలకు భారీ బందోబస్తు మధ్య పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంలో మంథని కోర్టుకు తీసుకొచ్చారు. జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్, జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు ఎదుట ముగ్గురినీ హాజరు పర్చారు. జడ్జి నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించా రు. అనంతరం వారిని పోలీసులు కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. గురువారం అరెస్టు చేసిన ముగ్గురితోపాటు శుక్రవారం అదుపులోకి తీసుకున్న బిట్టు శ్రీను సైతం మంథని కోర్టులో రిమాండ్‌ చేస్తారనే సమాచారం మేరకు నిందితుల కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. మీడియా ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టు వద్దే పడిగాపులు కాశారు.

మొదట మధ్యాహ్నం ఒంటిగంటకు అని తర్వాత సాయంత్రం 4 గంటలకని తెలిపారు. కోర్టు సమయం ముగిశాక.. రాత్రి 8 గంటల వరకు మంథని లేదా గోదావరిఖనిలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారని ప్రచారం జరిగింది. కానీ రాత్రి 11 గంటలకు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. నిందితులు మీడియా, ప్రజల కంట పడకుండా కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   

చదవండి: ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
                   ‘కేకులు కోసినట్లు పీకలు కోస్తారా?’
                  న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు

మరిన్ని వార్తలు