న్యాయవాదుల హత్య: నేడు కత్తుల వెలికితీత

26 Feb, 2021 08:12 IST|Sakshi
హత్యకు గురైన హై కోర్టు న్యాయవాద దంపతులు (ఫైల్‌ఫోటో)

జ్యుడీషియల్‌ కస్టడీకి ‘జంటహత్యల’ కేసు నిందితులు

నేడు బ్యారేజీ నుంచి కత్తులు వెలికితీసే అవకాశం

గోదావరిఖని/వరంగల్‌: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 17న వారిద్దరూ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రామగుండం కమిషనరేట్‌ పోలీసులు గురువారం జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వరంగల్‌ జైలుకు వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్‌ మధ్య రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు తరలించారు.

జైలు నుంచి నిందితులను రామగుండం తరలించేసరికి సాయంత్రం కావడంతో హత్యకు ఉపయోగించిన కత్తుల వెలికితీతను వాయిదా వేశారు. కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. పది మీటర్ల లోతులో ఉన్న వీటిని శుక్రవారం వెలికితీయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జంటహత్యల్లో ఎవరి పాత్ర ఏమిటి, సహకరించిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుపై హైకోర్టు, గవర్నర్‌ సైతం స్పందించడంతో పోలీసులు ప్రతీదీ సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తున్నారు.  

చదవండి: ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?!

మరిన్ని వార్తలు