ప్రేమ పేరిట అమ్మాయిలకు ఎర.. నమ్మిన స్నేహితులను కూడా

5 Mar, 2022 14:53 IST|Sakshi
మాట్లాడుతున్న ఏసీపీ సారంగపాణి

సాక్షి, పెద్దపల్లి, ఖమ్మం : పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట్లలో పరిచయమయ్యే మహిళలే కాకుండా స్నేహితులను మాయమాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన మోసగాడిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాహుల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నివాసముంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాహుల్‌ రూ.15.5లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.

ఆ తర్వాత కూడా మరికొంత డబ్బు తీసుకుంటూ, ఇచ్చేస్తున్న ఆయన అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు తీసుకుని ఫైనాన్స్‌ సంస్థలో కుదవపెట్టగా తనను మోసం చేసినట్లు తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ ఉపేందర్‌ ప్రత్యేక బృందాలతో గాలించి రాహుల్‌ను అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు. అయితే, రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్‌ ఎల్‌బీ.నగర్‌లో, 2013లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చీటింగ్‌ కేసులు నమోదయ్యాయని ఏసీపీ సారంగపాణి వివరించారు.
చదవండి: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి

ఇటీవల స్నేహితులను కూడా ఐటీ సమస్యలు ఉన్నాయని నమ్మించి రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలిపారు. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్‌ఖలీల్‌ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్‌ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ. 2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ. 2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని చెప్పారు.

మరిన్ని వార్తలు