ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి

24 Jun, 2021 21:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఒక రైలు ఎక్కబోయి మరో రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35)గా రైల్వే పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ తన అంకుల్ జగ్‌మోహన్, సోదరుడు విజయ్‌, తన స్నేహితులు  సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ వెళ్లేందుకు బుధవారం రాత్రి ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు కదిలిన కాసేపటికి ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో కంగారు పడి ఏం ఆలోచించకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. అజయ్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

చదవండి: కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్‌

మరిన్ని వార్తలు