-

దారుణం: ఇంటికి నిప్పు.. అత్యాచార బాధితురాలు మృతి

6 Mar, 2021 20:48 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆత్యాచార బాధిత మహిళ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్‌తో తగలబెట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఆమె తీవ్రంగా కాలిపోయింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమన్‌గర్‌ జిల్లాలోని గోలువాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ ఇంటికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి బయట నుంచి ఆమెను పేరుతో పిలిచారు. దీంతో ఆమె ఇంటి తలపు తీయగా కిరోసిన్‌ పోసి వెంటనే నిప్పుపెట్టి పారిపోయారు. ఇంటిలో ఒక్కసారిగా తీవ్రంగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆ మహిళ శరీరం సగం కంటే ఎక్కువగా  కాలిపోయింది.

స్థానికులు  ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆమె శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహిళ అమ్మమ్మ తన మనమరాలిపై ఆత్యాచారం చేసిన నిందితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన అత్యాచార బాధిత మహిళ కుటుంబ సభ్యులకు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ రూ.5 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించినట్ల సీఎం కార్యాలయం ప్రకటించింది.
చదవండి: సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్‌ దర్శకుడు

మరిన్ని వార్తలు