ప్రధాని ఆఫీస్‌ను అమ్మబోయారు! 

19 Dec, 2020 08:11 IST|Sakshi

వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాలు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని రూ.7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్‌కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా తెలిపారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ముందుగా అవాక్కయ్యారు వెంటనే ఆ యాడ్‌‌ను తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు