‘ఎక్స్‌టార్షన్‌’ గ్యాంగ్‌.. బ్లాక్‌మెయిల్‌ చేసి రూ. 89 లక్షలు

28 Jun, 2021 13:50 IST|Sakshi
అల్వార్‌ పోలీసులు అరెస్టు చేసిన ముఠా

ఫేస్‌బుక్‌ ద్వారా ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు

11 మందిని అరెస్టు చేసిన రాజస్థాన్‌ పోలీసులు

నగరంలోనూ 10 నేరాలు చేసినట్లు అంగీకారం

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో అశ్లీలంతో ఎర వేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలు చేసే ఎక్స్‌టార్షన్‌ గ్యాంగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రాజస్థాన్‌లోని మేవాట్‌ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్‌లో పది కేసులు నమోదై ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ వారిపై న్యాయస్థానం నుంచి ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్లు తీసుకున్నారు. వీటి ఆధారంగా వారిని ఇక్కడకు తీసుకొస్తున్నారు. రాజస్థాన్‌లోని మేవాట్‌ రీజియన్‌లో ఉండే ఆల్వార్, భరత్‌పూర్, మా«థుర ప్రాంతాలకు చెందిన 11 మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వార్, భరత్‌పూర్‌లలో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు.  

నకిలీ వివరాలు, ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన ఆకర్షణీయమైన మహిళల ఫొటోలతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశారు. ఈ ప్రొఫైల్స్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో ఉన్న అనేక మందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. వీటిని యాక్సెప్ట్‌ చేసి ఫ్రెండ్స్‌గా మారిన వాళ్లతో సైబర్‌ నేరగాళ్లు కొన్నాళ్ల పాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్‌లో చాటింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌ నంబర్లు ఇచ్చేలా చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ నుంచి సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్‌ ద్వారా తమ ఫోన్‌లో ఉంచి టార్గెట్‌ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్నామంటూ ఆ యాప్‌లోని వీడియోను ప్లే చేస్తున్నారు. 

దీంతో పూర్తిగా తమ వలలో పడిపోతున్న బాధితులను సైబర్‌ నేరగాళ్లు అనేక రకాలైన మాటలు చెబుతూ తాము చెప్పినట్లు చేసేలా చేస్తున్నారు. ఇలా సేకరించిన ‘వ్యక్తిగత వీడియో’లను యూట్యూబ్‌ చానల్స్‌లో ఉంచుతున్నారు. ఆ లింకుల్ని బాధితులకు వాట్సాప్‌ చేసి తాము కోరిన మొత్తం చెల్లిస్తేనే వీటిని తొలగిస్తామని, లేదంటే ఇతర సోషల్‌ మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్‌ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట్‌ చేయించుకుంటున్నారు. ఆపై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్స్‌ చేస్తూ మరో అంకానికి తెరలేపుతున్నారు. 

ఇలా రాజస్థాన్‌లోని అల్వార్‌ ప్రాంతానికి చెందిన వారినీ ఈ గ్యాంగ్‌ వేధించింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు మొత్తం 11 మందిని పట్టుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన 10 మంది నుంచి రూ. 89 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు ఇక్కడ కేసులు ఉండటంతో ఒకటి రెండు రోజుల్లో సిటీకి తీసుకురానున్నారు. 

చదవండి: అతడి భార్య, ఆమె భర్త మిస్సింగ్‌.. పోలీసులే అవాక్కయ్యారు!
హైదరాబాద్‌: ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? 

మరిన్ని వార్తలు