ఆన్‌లైన్‌ క్లాస్‌.. బాలిక ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌

17 Sep, 2020 10:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మేడ్చల్‌ : ఆన్‌లైన్‌ విద్య కారణంగా పాఠశాల విద్యార్థులకు మొబైల్‌ ఫోన్స్‌ చేతికివ్వడంతో తీవ్ర అనార్థాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో అపరిచితుల చేతికి చిక్కి అభాసుపాలవుతున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలో పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు వేధింపులకు దిగారు. ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తామంటూ బెదిరించే ఏకంగా నాలుగు లక్షల వసూలు చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కావడంతో జీడిమెట్లకు చెందిన ఓ బాలికకు కుటుంబసభ్యులు ఫోన్ కొనిచ్చారు. క్లాసుల అనంతరం బాలిక సోషల్‌ మీడియా సమయం గడపడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇస్టాగ్రామ్‌లో ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఆమెతో స్నేహం పెంచుకున్న యువకులు... చనువుగా మాట్లాడం ప్రారంభించారు. (యూపీలో సమాజం తలదించుకొనే చర్య)

ఈ క్రమంలోనే బాలిక ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. ఇన్‌స్టాలోని ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తామని బెదిరింపులకు దిగారు. తొలుత నాలుగు లక్షలు తీసుకున్నారు. మరికొంత డబ్బు కావాలంటూ ఈనెల 14న బాలిక ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు గమనించి వారిని ప్రశ్నించడంతో తెలివిగా స్టడీ మెటీరియల్‌ కోసం వచ్చామంటూ బుకాయించారు. అయితే ఇంట్లో డబ్బు మాయం కావడంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా అసలు నిజం బయటపెట్టింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురు యువకులు ఎలిశా, కిషోర్, రాంవికాస్‌ను అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులు నేపథ్యంలో పిల్లలు సైబర్‌ క్రైమ్‌ నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం అనార్ధాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు