స్నేహితుడే కాలయముడు 

4 Oct, 2020 09:11 IST|Sakshi
మృతుడు ఎం.రామగోపాల్ ‌- నిందితుడు తోట నాగేంద్రబాబు

లారీతో తొక్కి చంపేసిన డ్రైవర్‌

హత్యను ఛేదించిన పోలీసులు 

బొబ్బిలి/బొబ్బిలి రూరల్(కృష్ణా జిల్లా)‌: బొబ్బిలి మండలం మెట్టవలస సమీపంలో గ్రోత్‌ సెంటర్‌ వద్ద ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న గుర్తు తెలియని మృతదేహం నుజ్జయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్‌ 5న అర్ధరాత్రి దాటాక వాహనాలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. ఇంతలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కనిపించడం లేదని, సెపె్టంబర్‌ 5న అతని సెల్‌ సిగ్నల్‌ బొబ్బిలిలో చూపించిందని అక్కడి పోలీసులు బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై విచారణ మొదలుపెట్టారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు హత్యగా గుర్తించి నిందితుడు తోట నాగేంద్రబాబును పట్టుకుని శనివారం డీఎస్పీ జె.పాపారావు, బొబ్బిలి రూరల్‌ సీఐ పి.శోభన్‌బాబు విలేకరులకు వివరాలు అందజేశారు. (చదవండి: వన్‌ సైడ్‌ లవ్‌ ఉన్మాదం.. అందర్నీ తగల బెట్టేస్తా..)

ఆగస్టు 26న ఏపీ 39యూ6499 నంబరు గల లారీలో డ్రైవర్‌ తోట నాగేంద్రబాబు అలియాస్‌ చంటి, క్లీనర్‌ వెంకటేశ్వరరావు కంచికచర్లలో బయలుదేరి స్థానికంగా కొన్ని లోడులు వేసుకుని తిరిగి కంచికచర్ల వచ్చారు. నాగేంద్రబాబు స్నేహితుడు ఆ్రస్టేలియా నుంచి వచ్చి ఉంటున్న మాలుపూరి రాంగోపాల్‌ను లారీలో తీసుకుని గుజరాత్‌ టైల్స్‌ లోడుకు వెళ్లారు. రాంగోపాల్‌ తన ఇంట్లో ఆగస్టు 28న తాను హైదరాబాద్‌ వెళ్తున్నట్టు చెప్పి వెళ్లాడు. 

ఈ విషయాన్ని రాంగోపాల్‌ తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సీతమ్మ ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మధ్యలో లారీ క్లీనర్‌ వెంకటేశ్వరరావు డ్యూటీ మారి పి.సాయితేజ క్లీనర్‌గా వెళ్లాడు. టైల్స్‌ లోడుతో బొబ్బిలి వచ్చి అన్‌లోడ్‌ చేసి సెప్టెంబర్‌ 5న బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో సిమెంట్‌ షాపు వద్ద రాంగోపాల్‌కు లారీ డ్రైవర్‌ నాగేంద్రబాబు మద్యం పట్టించాడు. నాగేంద్రబాబుకు మద్యం అలవాటున్నా సేవించకుండా జాగ్రత్త పడ్డాడు. క్లీనర్‌ సాయితేజను క్యాబిన్‌లో పడుకోమని చెప్పి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాంగోపాల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అతనితో వాదులాటకు దిగి పూటుగా తాగించాడు. మద్యం మత్తులో స్పృహ కొల్పోయిన రాంగోపాల్‌ను జాతీయ రహదారిపై పడుకోబెట్టి రాత్రివేళ తన లారీతో తొక్కించి నుజ్జునుజ్జు చేశాడు. 

విశాఖ వైపు వెళ్లాల్సిన లారీని తిరిగి బొబ్బిలి వైపు తిప్పి ఎవరికీ అనుమానం రాకుండా కంచికచర్ల వెళ్లిపోయి లారీతో గుజరాత్‌ వెళ్లిపోయాడు. క్యాబిన్‌లో పడుకున్న క్లీనర్‌ సాయితేజ రాంగోపాల్‌ ఎక్కడని ప్రశి్నస్తే రూ.3వేలు తీసుకుని బంధువుల వద్దకు వెళ్లాడని ఒకసారి, బొబ్బిలిలో టిప్పర్‌ ఢీకొందని మరోసారి చెప్పి ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే చంపేస్తానని నాగేంద్రబాబు బెదిరించాడు. ఇంతలో తమ కుమారుడు కనిపించకపోవడంతో రాంగోపాల్‌ తల్లిదండ్రులు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేసి సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడు తోట నాగేంద్రబాబును పలు సెక్షన్ల కింద శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి పలు విషయాలు రాబట్టాల్సి ఉందని, క్లీనర్లను విచారించాల్సి ఉందని డీఎస్పీ పాపారావు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్‌ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ సత్యనారాయణ పూర్తి స్థాయిలో సహకరించారని వారిని అభినందిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.  

ఫేక్‌ ఆడియోతో పక్కతోవ పట్టించే యత్నం... 
కాగా నిందితుడు కంచికచర్లలో తన సోదరికి ఫోన్‌ చేసిన రాంగోపాల్‌ను టిప్పర్‌ ఢీకొందని, తనకు భయం వేస్తోందని ఫొన్లో చెప్పి రికార్డు చేసి, స్నేహితుల ద్వారా రాంగోపాల్‌ బంధువులకు పంపాడని, తమకు అనుమానం వచ్చిందని కంచికచర్ల నుంచి వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు రఘునాథ్, రామగోపాల్‌ విలేకరులకు తెలిపారు. నిందితుడిని, ఇంకా సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు