మహిళలతో చనువుగా ఫోన్‌ చేయించి అర్ధనగ్న ఫొటోలు..

24 Aug, 2021 09:37 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి

అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరింపు

డబ్బులు వసూలు చేసే ముఠా అరెస్ట్‌  

కర్నూలు: ‘నీవు నాకు బాగా తెలుసు... అందంగా ఉంటావు.. చాలాసార్లు మాట్లాడాలని ప్రయత్నించా.. కుదర్లేదు. నీకు పరిచయమున్న వ్యక్తి నీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. అందుకే ఫోన్‌ చేస్తున్నా. ఓసారి ఇంటికి రా మాట్లాడుకుందాం’... అంటూ మహిళతో చనువుగా ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు నిఘా వేసి పట్టుకుని కటకటాలలోకి పంపారు. కర్నూలు నగరం బంగారుపేటకు చెందిన వంట మాస్టర్‌ శకుంతల, ఆటో డ్రైవర్‌ కిశోర్, ఫ్లంబర్‌ రాజు అలియాస్‌ నాగరాజు, బీడీ బంకు ద్వారా జీవనం సాగిస్తున్న అంజనమ్మను 4వ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఎదుట హాజరు పరిచారు.

చదవండి: ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..


సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఐదుగురు ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన గిడ్డయ్య నిర్మల్‌ నగర్‌లో ఉంటాడు. మరో వ్యక్తి దాసుతో కలిసి బాగా డబ్బు ఉన్న వారి ఫోన్‌ నంబర్లను సేకరించి శకుంతల, అంజనమ్మల ద్వారా తియ్యనైన మాటలతో ముగ్గులోకి దింపి ఇంటికి రప్పించుకుని అమ్మాయిలతో కలిసి ఉన్నప్పుడు అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

20 రోజుల క్రితం లేబర్‌ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి తియ్యనైన మాటలతో ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుని ట్రాప్‌లో పడేసి బెదిరించి అతని వద్ద రూ. 1.20 లక్షలు నగదు తీసుకున్నారు. అలాగే ఈ నెల 9వ తేదీన రాంరహీమ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా ఇంటికి పిలిపించుకుని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించి రూ. 4 లక్షలు విలువ చేసే రెండు ప్రామిసరీ నోట్లు, మరో రూ. 4 లక్షలు విలువ చేసే రెండు చెక్కులను తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండుకు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు.

చదవండి: డీజీపీని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు

>
మరిన్ని వార్తలు