సినీఫక్కీలో లారీకి ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసి..

2 Mar, 2022 16:45 IST|Sakshi

శంషాబాద్‌(హైదరాబాద్‌): సినీ ఫక్కీలో  గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు శంషాబాద్‌ జోన్‌ ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు చెక్‌ పెట్టారు. మహారాష్ట్ర పింప్రి ప్రాంతానికి చెందిన పరుశురాం,అంకుష్‌ పండులే గంజాయి అక్రమ రవాణాకు పథకం పన్నారు. ఇందులో భాగంగా అహ్మద్‌నగర్‌కు  చెందిన ఉమేష్‌ గైక్వాడ్, ప్రదీప్‌ కలంగి, దత్తసాకత్, సతీష్‌ విజయ్‌ షిండే, విశాల్, అశోక్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వారిలో కొందరు డ్రైవర్లు ఉన్నారు. వీరు గంజాయి తీసుకువస్తే మరికొందరు వాటిని అవసరమైన వారికి విక్రయించేవారు. ఇందులో భాగంగా ఆరునెలల క్రితం అహ్మద్‌నగర్‌లో లారీకి ప్రత్యేక క్యాబిన్‌ తయారు చేయించారు. 

ముందుగా ఎస్కార్ట్‌.. 
సుత్రధారులైన పరుశురాం, అంకుష్‌ పండే గంజాయి సరఫరా చేసే ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సుభాన్, భాషాలను సంప్రదించారు. కిలో రూ. 2500 చొప్పున 400 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. పథకంలో భాగంగా ఫిబ్రవరి 22  ఖమ్మం ఏజెన్సీలో వారికి లారీని అప్పగించగా గంజాయి లోడ్‌ చేశారు. 27న లారీతో భద్రాచలం, సూర్యాపేట మీదుగా మహారాష్ట్రకు బయలుదేరారు. లారీని ఎవరు పట్టుకోకుండా ముందు కారులో కొందరు ఎస్కార్ట్‌గా వెళ్లారు.

ముందస్తు సమాచారంతో శంషాబాద్‌ ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు షాబాద్‌ ఎక్స్‌రోడ్డు వద్ద వారిని అదుపులో కి తీసుకున్నారు. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి సుభాన్, భాషా, అంకుష్‌ పండులే మినహా మిగతా వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 400 కేజీల గంజాయి, రూ.15 వేల నగదు, కారు, లారీ, 9 ఫోన్లు, బంగారు, వెండి ఉంగరాలు, గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఓటీ, చెవెళ్ల పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.


    

మరిన్ని వార్తలు