దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌

7 Aug, 2020 18:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించారు. కాసేపట్లో గుత్తి కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డి కండీషన్‌ బెయిల్‌పై గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, జేసీ విడుద‌ల సంద‌ర్భంగా కడ‌ప సెంట్రల్‌ జైలు వ‌ద్ద ఆయ‌న‌ వ‌ర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధ‌న‌లు కాల‌రాశారు. దీంతో కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్‌, ప‌వ‌న్‌కుమార్ స‌హా 31 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
(చదవండి: విడుద‌లైన 24 గంట‌ల్లోపే జేసీపై మ‌రో కేసు)

మరోవైపు జేసీ, అస్మిత్‌లు క‌డ‌ప సెంట్ర‌ల్ జైలు నుంచి తాడిప‌త్రి వర‌కు అనుచ‌ర‌గ‌ణంతో ర్యాలీగా వ‌చ్చారు. ఈ క్ర‌మంలో జేసీ ద‌ళిత సీఐ దేవేంద్ర‌ను ప‌బ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్‌డౌన్ నిబంధనలు జేసీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీటితోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 52 కింద కూడా జేసీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

('పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన')

మరిన్ని వార్తలు