కారు కావాలా బాబు? మా దగ్గర ధర కొంచెం తక్కువే..

6 Jul, 2022 16:50 IST|Sakshi

వేలూరు: కార్ల విక్రయాల పేరుతో లక్షలు స్వాహా చేస్తున్న నకిలీ ఎస్‌ఐ దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వివరాల మేరకు.. తిరువళ్లరు జిల్లా సుంగాచత్రంకు చెందిన రోహిణి(32)కి గత ఏడాది రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన వ్యాపారి దినేష్‌ కుమార్‌ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో రోహిణి తాను చెన్నైలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నట్లు తెలిపింది.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను విక్రయిస్తున్నానని, ఎవరైనా కొనుగోలు చేయాలను కుంటే తనను సంప్రదించాలని నమ్మించింది. అది నమ్మిన దినేష్‌ కుమార్‌ రోహిణికి రూ.2 లక్షలు, ఈమె భర్త చంద్రుకు రూ.12 లక్షలు ఇచ్చి రెండు కార్లు కావాలని కోరాడు. కొద్ది రోజులకు తన స్నేహితులకు మరో రెండు కార్లు కావాలని రోహిణి అకౌంట్‌లోకి రూ.10 లక్షలు జమ చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా రోహిణి నుంచి కార్లు అందకపోవడంతో దినేష్‌కుమార్‌ వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రోహణి నకిలీ ఎస్‌ఐగా నటిస్తూ పలువురి వద్ద లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు