'మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చావంటే చంపుతా'

9 Jan, 2021 19:20 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ప్రేమ పేరుతో యువకుడి చేతిలో ఒక మైనర్ బాలిక మోసపోయింది. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి బాలికను తల్లిని చేసిన యువకుడు ఇప్పుడు ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టిన బిడ్డను తీసుకొని న్యాయం కోసం పోలీసుల వద్దకు వచ్చింది. కాగా యువకుడిని అరెస్ట్‌ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాలు.. కరీంనగర్ లోని గోదాంగడ్డకు చెందిన సమీర్‌ .. గణేష్ నగర్ లో నివాసం ఉండే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మైనర్‌ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. బ్యాంగిల్ షాప్ లో పనిచేస్తున్న ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో బాలిక గర్బం దాల్చడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి పెళ్లి చేసుకోమని యువకుడిని నిలదీశారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సమీర్‌ పాప పుట్టేవరకు కాలం గడిపాడు.

గత నవంబర్ 12న యువతి పాపకు జన్మనివ్వడంతో ముఖం చాటేసిన సమీర్‌ పెళ్ళికి నిరాకరించాడు. పుట్టిన పాపతో తనకు ఏమి సంబంధం లేదని.. కట్నం డబ్బు తెస్తేనే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన సమీర్‌ అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చేసుకోవాలని సమీర్‌ వద్ద ఒత్తిడి తేవడంతో పెళ్లి ప్రస్తావన తెస్తే చంపుతానని బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు