మొదటి రాత్రే భర్తకు మత్తుమందు ఇచ్చింది..!

27 Mar, 2022 15:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఛండీగఢ్‌: ఆమె తన అందంతో గాలం వేసి పరిచయం చేసుకుంటుంది.. ఈ తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఇక, ఫస్ట్‌ నైట్‌ రోజున వరుడికి మత్తుమందు ఇచ్చి.. డబ్బులు, నగలతో మాయమవుతుంది. ఇలా ఏకంగా ఏడుగురికి షాకిస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఓ మహిళ విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకుల్ని టార్గెట్‌ చేసింది. ముందుగా ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని..  తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, తన పెళ్లి ఓ మధ్యవర్తితో జరిగిందని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. దీంతో వారి మధ్య ఉన్న సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రే మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో అక్కడి నుంచి ఉండాయించేది. 

ఇలా జరుగుతున్న క్రమంలో ఆమె వివాహం చేసుకున్న నాలుగో భర్త రాజేందర్‌ను మోసం చేసి డబ్బులు, నగలతో పారిపోయింది. దీంతో రాజేందర్‌ పోలీసులను ఆశ్రయించాడు. వారి పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను పోలీసులకు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగానే సదరు మహిళ శనివారం ఏడో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. ఆమెను, ఆ ముఠా సభ్యులను పట్టుకున్నారు. 

విచారణలో భాగంగా.. ఆమె మొదటగా ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్​ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్​లో జరిగింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్​తో.. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్​తో.. ఆరో వివాహం కర్నాల్​కు చెందిన సందీప్​తో జరిగింది. చివరగా ఏడో వివాహం మార్చి 26న (శనివారం) బుద్వాకు చెందిన సుమిత్​తో జరిగింది. దీంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు