కేసు విషయమై పంచాయతీ పెట్టిన రెండు పోలీస్‌ స్టేషన్లు

30 Jan, 2022 21:34 IST|Sakshi

తిరువళ్లూరు(చెన్నై): రెండు పోలీస్‌ స్టేషన్ల మధ్య సరిహద్దు సమస్య కొలిక్కి రాకపోవడంతో ఓ మృతదేహం వెలికితీత ఆలస్యమైంది. వివరాలు.. మనవాల నగర్‌ సమీపంలోని నదిలో సుమారు 42 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు మనవాల్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన మనవాల్‌నగర్‌  పోలీసులు మృతదేహం తేలుతున్న ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పి వెళ్లిపోయారు.

దీంతో స్థానికులు తిరువళ్లూర్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ పద్మశ్రీ నేతృత్వంలోని పోలీసులు మృతదేహం పడి ఉన్న ప్రాంతం మనవాల్‌నగర్‌ పరిధిలోకి వస్తుందంటూ వెళ్లిపోయారు. తీరా.. తిరువళ్లూర్‌ టౌన్‌ మనవల్‌నగర్‌ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే విషయంలో పట్టింపులకు పోవడంతో మృతదేహం నదిలోనే ఉండిపోయింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మృతదేహం పడి ఉన్న ప్రాంతం తిరువళ్లూర్‌ టౌన్‌ పోలీసులకు వస్తుందంటూ రెవెన్యూ అధికారులు నిర్ధారించి వారి ఆధ్వర్యంలో వెలికి తీశారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. కాగా రెండు పోలీస్‌ స్టేషన్లు పట్టింపు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.   

మరిన్ని వార్తలు