ఆ భూమి మాది, నేను మంత్రి గన్‌మెన్‌ని.. తలుచుకుంటే..

4 Dec, 2021 13:44 IST|Sakshi

తన భార్యపేర భూమి అంటూ పట్టాదారులకు బెదిరింపులు...

సీపీనీ ఆశ్రయించిన పట్టాదారులు..

విచారణకు ఆదేశం..

సాక్షి,హసన్‌పర్తి(వరంగల్‌): భూతగాదాల్లో ఓవైపు నగర కమిషనర్‌ ఉక్కుపాదం మోపుతుంటే.. మరో వైపు పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూ కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతుండగా, వారికి గన్‌మెన్‌లు కూడా ఒక అడుగు ముందుకు వేశారు. తన భార్య, సంబంధీకుల భూమిగా చెబుతూ రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. తాము పోలీస్‌.. ఓ మంత్రి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నా అంటూ ఏదైనా చేయవచ్చని రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు.

నాలుగేళ్లుగా సమస్య సాగుతూనే ఉంది. చివరికి బాధిత రైతు కొంరయ్య ఇటీవల నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. స్థానిక ఏఎస్సై ప్రకాష్‌రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. వివరాలు.. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ శివారులోని సర్వే నంబర్‌ 527లో 2.30 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి సిలువేరు కొంరయ్య పట్టాదారుడిగా కొనసాగుతున్నాడు. పక్కనే సర్వే నంబర్‌ 529లో సుమారు 3.16 ఎకరాల భూమి పొలం ధర్మారెడ్డికి చెందినది. ఈ భూమిని ధర్మారెడ్డి విక్రయించాడు.

ఇందులో మంత్రి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ  కానిస్టేబుల్‌ భార్య, బావమరదులకు ఇంచు భూమి కూడా లేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పూర్వీకుల నుంచి వచ్చినదని బాధితుడు చెప్పాడు. వీరికి భూమి లేకున్నా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు తయారు చేసుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో వివరించాడు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో కొంరయ్య విజ్ఞప్తి చేశాడు. 

చదవండి: వరంగల్‌లో పరువు హత్య.. అంజలి ప్రేమవ్యవహారం నచ్చక..

మరిన్ని వార్తలు