‘ఆన్‌లైన్‌ ఆకతాయిల’ ఆటకట్టు 

18 Jul, 2022 08:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌..ఎక్కడపడితే అక్కడ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాలలో మఫ్టీలో పోలీసులు గస్తీ కాస్తూ పోకిరీలను పట్టుకుంటున్న పోలీసులు ఆన్‌లైన్‌ ఆకతాయిలను కూడా అదే రీతిలో ఆటకట్టిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి అన్ని సామాజిక మాధ్యమాలలో మారు పేర్లతో ఖాతాలను తెరిచి..24/7 గస్తీ కాస్తున్నారు.

దీంతో సోషల్‌ మీడియాలో డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించి మహిళలు, పిల్లలను వేధిస్తున్న పోకిరీలకు అరదండాలు వేస్తున్నారు. ఇప్పటివరకు సైబరాబాద్‌ వర్చువల్‌ షీ టీమ్స్‌ 65 మంది పోకిరీలపై కేసులు నమోదు చేశాయి. నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించాయి. ఎక్కువగా ఇన్‌స్ట్రాగామ్‌లో మహిళలను వేధిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 

80 శాతం ఆన్‌లైన్‌ వేధింపులే.. 
గతంలో మహిళలపై వేధింపులలో 80 శాతం ఆఫ్‌లైన్‌లో, 20 శాతం ఆన్‌లైన్‌లో ఉండేవి. కానీ, ఇప్పుడవి రివర్స్‌ అయ్యాయి. ఆన్‌లైన్‌లో వేధింపులు 80 శాతానికి చేరాయి. సోషల్‌ మీడియాలో ఎవరూ పట్టుకుంటారులే అనే ధీమాతో పోకిరీలు కూడా డిజిటల్‌లోకి మారి.. ఆన్‌లైన్‌ వేదికగా మహిళలు, పిల్లలను వేధిస్తున్నారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆఫ్‌లైన్‌లో 11, ఆన్‌లైన్‌లో 12 షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో ఇద్దరేసి పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయా అధికారులు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, వాట్సాప్‌ గ్రూప్స్, డేటింగ్‌ యాప్‌లపై 24/7 గంటలు నిఘా పెడుతుంటారు. నింతరం సామాజిక మాధ్యమాలలో ఖాతాలను నిర్వహిస్తూ.. మహిళలు, అమ్మాయిలు, పిల్లలను టార్గెట్‌ చేసుకొని పోస్ట్‌లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేసే ఆకతాయిల భరతం పడుతుంటారు.

(చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..)

మరిన్ని వార్తలు